ధర్మం అంటే న్యాయం, సత్యం, కర్తవ్యబోధ, పరస్పర గౌరవం. ఇవి లేకుండా ఏ సమాజమైనా నిలబడలేడు. చట్టాలు భయంతో మనిషిని నియంత్రిస్తే, ధర్మం అంతఃకరణతో మనిషిని సరిదిద్దుతుంది. శిక్ష భయంతో తప్పు చేయకుండా ఉండటం ఒక విధం అయితే, ధర్మబోధతో తప్పు చేయకపోవడం మరొక విధం. సమాజానికి అవసరమైనది రెండవది.
నేటి కాలంలో సమాజం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అవినీతి, అన్యాయం, హింస, అసహనం వంటి దుష్పరిణామాలకు మూలకారణం ధర్మం పట్ల నిర్లక్ష్యమే. ధర్మం బలహీనపడినప్పుడు అశాంతి పెరుగుతుంది. ధర్మం బలంగా ఉన్నప్పుడు సమాజం స్వయంగా తనను తాను కాపాడుకుంటుంది. అందుకే ధర్మం ఒక రక్షణ కవచం లాంటిది.
ధర్మం అస్త్రం అంటే హింస కాదు. అది ఆత్మబలం. ఇతరాయుధాలు శరీరాన్ని గాయపరుస్తే, ధర్మం మనసును జాగృతం చేస్తుంది. ధర్మబద్ధంగా ఆలోచించే వ్యక్తి ఎప్పుడూ సమాజానికి హాని చేయడు. అతడు తన స్వార్థాన్ని నియంత్రించగలడు, ఇతరుల హక్కులను గౌరవిస్తాడు. ఇలాంటి వ్యక్తులతో కూడిన సమాజం ఎప్పుడూ బలంగా ఉంటుంది.
రాజకీయాలు, పరిపాలన, న్యాయవ్యవస్థ మొదలగునవన్నీ ధర్మానికి అనుగుణంగా నడిచినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అధికారంలో ఉన్నవారు ధర్మాన్ని విస్మరిస్తే, చట్టాలు కూడా అర్థం కోల్పోతాయి. అందుకే పాలకులకైనా, ప్రజలకైనా ధర్మం ఒకే ప్రమాణం కావాలి.
ధర్మం మనకు బాధ్యతను గుర్తుచేస్తుంది. హక్కుల గురించి మాట్లాడే ముందు కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. “నేను సమాజానికి ఏమిచ్చాను?” అనే ప్రశ్నను మనలో కలిగిస్తుంది. ఈ ప్రశ్నే సమాజాన్ని సరిదిద్దే శక్తివంతమైన ఆయుధం.
ముగింపుగా చెప్పాలంటే, ధర్మము లేకుండా సమాజం అస్తవ్యస్తంగా మారుతుంది. ధర్మం ఉన్న చోట న్యాయం ఉంటుంది, న్యాయం ఉన్న చోట శాంతి ఉంటుంది. అందుకే ధర్మము అనేది సమాజాన్ని కాపాడే అస్త్రం మాత్రమే కాదు. అది సమాజానికి ప్రాణవాయువూ కూడా
- తుంగా శ్రీ