హిందుత్వం ఒక మతపరమైన గుర్తింపుగా చూడటం అతి చిన్న దృష్టికోణం. అది జీవన విధానం, ఆలోచనా పద్ధతి, విలువల సమాహారం. సత్యం, అహింస, కర్తవ్యబద్ధత, సహనం, సమన్వయం మొదలగునవన్నీ సనాతన హిందూ ధర్మం మనకు నేర్పిన మూల సూత్రాలు. ఈ ధర్మసూత్రాలే వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని నిలబెట్టాయి.
భాషలు మారవచ్చు. ఒకరు తెలుగులో మాట్లాడవచ్చు, మరొకరు తమిళంలో, ఇంకొకరు హిందీలో. కానీ “ధర్మం” అనే పదానికి అర్థం మాత్రం ఎక్కడా మారదు.
జాతి, భాష, ప్రాంతం పేరుతో హిందువులను విడదీయాలనే ప్రయత్నాలు నేటి సమాజంలో ఎక్కువయ్యాయి. కానీ ధర్మం ఎప్పుడూ విభజనను బోధించలేదు. “అహం బ్రహ్మాస్మి” అనే తత్త్వం ప్రతి మనిషిలో దైవత్వం ఉందని చెబుతుంది. అప్పుడు ఒకే ధర్మాన్ని అనుసరించే వారిలో ఎత్తు, తక్కువలు ఎలా ఉండగలవు?. ధర్మ పరంగా అందరూ సమానమే అన్న భావన హిందుత్వం యొక్క అసలైన బలం.
ప్రాంతీయత పేరుతోనూ హిందుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే ధర్మ ప్రవాహం ప్రవహిస్తోంది. ఆలయాలు, పండుగలు, సంప్రదాయాలు రూపంలో వేరైనా, ఆత్మలో మాత్రం ఒక్కటే. ఈ సత్యాన్ని గుర్తించిన రోజే హిందూ సమాజం తన అసలైన శక్తిని తెలుసుకుంటుంది.
ధర్మం బలహీనపడితే సమాజం బలహీనపడుతుంది. ధర్మం నిలబడ్డచోటే న్యాయం ఉంటుంది, సమతా భావం ఉంటుంది, సామాజిక సమరసత ఉంటుంది. అందుకే ధర్మ రక్షణ అనేది కేవలం ఆధ్యాత్మిక అంశం కాదు; అది సామాజిక, జాతీయ అవసరం. హిందుత్వం బంధుత్వంగా మారినప్పుడు, హిందువులు పరస్పరం శత్రువులుగా కాకుండా సహోదరులుగా నిలబడతారు.
హిందుత్వం అంటే ద్వేషం కాదు; ధర్మంపై గర్వం. హిందుత్వం అంటే ఇతరులను తక్కువగా చూడటం కాదు; తన మూలాలను గౌరవించడం. ఈ భావన ప్రతి హిందువు హృదయంలో బలపడినప్పుడే, ఎలాంటి విభజన శక్తులైనా నిర్వీర్యమవుతాయి.
అంతిమంగా చెప్పాలంటే, మనం ఏ జాతికి చెందినవారమో, ఏ భాష మాట్లాడుతున్నామో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో ముఖ్యం కాదు. మనల్ని ఒక్కటిగా నిలబెట్టేది ధర్మం. మనల్ని కుటుంబంగా మార్చేది హిందుత్వం.
జాతి, భాష, ప్రాంతం ఏదైనా – ధర్మమే బలం, హిందుత్వమే బంధుత్వం.
- తుంగా శ్రీ