ధర్మాన్ని నిలబెట్టే ఒక్క అడుగు, వేల మాటల కంటే గొప్పది - తుంగా శ్రీ

one step taken to uphold righteousness is greater than a thousand words

"ధర్మాన్ని నిలబెట్టే ఒక్క అడుగు, వేల మాటల కంటే గొప్పది” అనే భావం ఎంతో లోతైన సత్యాన్ని తెలియజేస్తుంది. మాటలు సులభం. ఎవరికైనా మంచిని చెప్పడం, ధర్మం గురించి బోధించడం, న్యాయం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం కష్టం కాదు. కానీ ఆ మాటలను ఆచరణలో పెట్టడం మాత్రం అసలైన. నిజమైన విలువ మనం చెప్పింది కాదు, మనం చేసింది. అందుకే ఒక చిన్న ధార్మిక చర్య కూడా అనేక ప్రసంగాల కంటే గొప్పగా నిలుస్తుంది.

ధర్మం అంటే కేవలం పూజలు, నియమాలు, సంప్రదాయాలు మాత్రమే కాదు. ధర్మం అంటే సత్యం, న్యాయం, కర్తవ్యబోధ, కరుణ, సమత మొదలగునవి. మన బాధ్యతను నిజాయితీగా చేయడం ధర్మం. ఇతరులకు హాని చేయకుండా ఉండడం ధర్మం. మనసాక్షి చెప్పిన మార్గంలో నిలబడటం ధర్మం. ఈ ధర్మాన్ని కాపాడేది మాటలు కాదు మన ఆచరణ.

మన సమాజంలో చాలా సందర్భాల్లో మంచి విషయాలు మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఆ మాటలను నిజంగా పాటించే వారు చాలా తక్కువ. ఉదాహరణకు, నిజాయితీ గొప్పదని అందరూ చెబుతారు. కానీ చిన్న ప్రయోజనం కోసం అబద్ధం చెప్పడంలో చాలా మంది వెనుకాడరు. ఇక్కడే మాటల విలువ తగ్గిపోతుంది. ఒక వ్యక్తి నిజాయితీ గురించి ప్రసంగం చేయకపోయినా, జీవితంలో నిజాయితీగా వ్యవహరిస్తే, అతను నిజమైన ధర్మవంతుడు.

ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, రోడ్డు మీద ప్రమాదంలో పడిన వ్యక్తిని చూసి చాలామంది బాధపడతారు, చర్చిస్తారు, వీడియోలు తీయవచ్చు. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చి సహాయం చేస్తే, ఆ ఒక్క అడుగు ధర్మాన్ని నిలబెడుతుంది. అతను చెప్పిన మాటలు కాదు, చేసిన పని సమాజానికి ఆదర్శం అవుతుంది. అదే “ఒక్క అడుగు” ఒక్క అడుగు, వేల మాటల కంటే గొప్పది.

ధర్మం గురించి గ్రంథాలు, తత్వాలు, శాస్త్రాలు ఎన్నో విషయాలు చెబుతాయి. కానీ వాటి అంతిమ లక్ష్యం మనిషి ప్రవర్తనలో మార్పు రావడం. జ్ఞానం ఉన్నా ఆచరణ లేకపోతే, అది భారంగా మారుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్నవారికి ఓదార్పు చెప్పడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడడం ఇవన్నీ ధర్మాన్ని నిలబెట్టే అడుగులే.

మన రోజువారీ జీవితంలో కూడా ఇది వర్తిస్తుంది. ఒక ఉద్యోగి తన పనిని నిబద్ధతతో చేయడం, ఒక గురువు తన విద్యార్థులను నిజంగా మార్గనిర్దేశం చేయడం, ఒక వ్యాపారి మోసం చేయకుండా నిజాయితీగా వ్యవహరించడం మొదలగునవన్నీ ధార్మిక చర్యలు. వీరు పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వకపోయినా, వారి ఆచరణ సమాజానికి బలమైన సందేశం ఇస్తుంది.

మాటలు ప్రభావం చూపుతాయి, కానీ తాత్కాలికంగా మాత్రమే. ఆచరణ మాత్రం శాశ్వత ప్రభావం చూపుతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాటల కంటే వారి ప్రవర్తనను ఎక్కువగా అనుకరిస్తారు. గురువు చెప్పిన నీతి కంటే ఆయన జీవనశైలి విద్యార్థిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే ధర్మాన్ని బోధించడం కంటే, ధర్మాన్ని జీవించడం గొప్పది.

కొన్ని సందర్భాల్లో ధర్మాన్ని కాపాడటం సులభం కాదు. ఒత్తిడి, భయం, ప్రయోజనాల ఆకర్షణ మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తాయి. అప్పుడు ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకోవడం ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో వేసిన ఒక్క అడుగు, మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. అది మనకు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇతరులకు ప్రేరణ అవుతుంది.

చరిత్రలో కూడా మనం చూస్తే, గొప్ప మార్పులు పెద్ద ప్రసంగాల వల్ల కాకుండా, కొద్దిమంది తీసుకున్న ధార్మిక నిర్ణయాల వల్ల జరిగాయి. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన వారు, సత్యం కోసం త్యాగం చేసిన వారు మాటలతో కాదు, కార్యాలతో చరిత్రను మార్చారు. వారి జీవితం ఒక సందేశం అయింది.

ధర్మం అంటే ఎప్పుడూ పెద్ద పనులే కావాలనేది తప్పు. చిన్న విషయాల్లో కూడా ధర్మం కనిపిస్తుంది. చెత్తను రోడ్డు మీద వేయకుండా ఉండడం, క్యూలో ముందుకు దూకకపోవడం, మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవడం, ఇతరుల సమయాన్ని గౌరవించడం, ఇవి కూడా ధర్మమే. చిన్నచిన్న అడుగులు కలసి పెద్ద మార్పును తీసుకువస్తాయి.

మనం తరచూ “ఎవరైనా చేయాలి” అని అనుకుంటాం. కానీ ధర్మం ఎదురు చూసే విషయం కాదు. అది ప్రారంభించాల్సినది. మనం మొదలుపెట్టాలి. ఒక చిన్న సత్యవంతమైన చర్య. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలదు. మన ఉదాహరణ చూసి ఇంకొకరు మారవచ్చు. అలా ధర్మం వ్యాప్తి చెందుతుంది.

మాటలు విత్తనాలైతే, కార్యాలు ఫలాలు. విత్తనం వేయడం అవసరం. కానీ ఫలం వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం మంచిదే. కానీ ధర్మాన్ని ఆచరించడం మరింత మంచిది. ఎందుకంటే ఆచరణే నిజమైన సాక్ష్యం.

చివరగా చెప్పాలంటే, ధర్మాన్ని నిలబెట్టే ఒక్క అడుగు అంటే సత్యం వైపు తీసుకునే నిర్ణయం, న్యాయం వైపు నిలిచే ధైర్యం, కర్తవ్యాన్ని నిర్వర్తించే నిబద్ధత. అది చిన్నదైనా, దాని ప్రభావం గొప్పది. వేల మాటలు వినిపించకపోయినా, ఒక మంచి పని ప్రపంచానికి వినిపిస్తుంది.

అందుకే, ధర్మం గురించి మాట్లాడటం ఆరంభం మాత్రమే. ధర్మం ప్రకారం జీవించడం అసలైన సాధన. ఒక్క అడుగు వేద్దాము . మాటలకంటే కార్యం గొప్పదని ప్రపంచానికి చూపుదాము.

- తుంగా శ్రీ